Friday 16 September 2016

శ్రీ రమణ గారు "మిథునం" కథ ద్వారా మనందరికీ పరిచయమే.... "నాకు నచ్చిన కథ" శీర్షికన ఆయన వ్రాసిన మరో ఆణిముత్యం "బంగారు మురుగు" కథ పరిచయం చేయబోతున్నాను...నేను ఎంతవరకూ న్యాయం చేయగలనో తెలియదు..ఎందుకంటే వారి కథలను క్లుప్తీకరించి వ్రాయడం సాహసమే...అచ్చతెలుగు కథలకు మరో ఉదాహరణ ఈ " బంగారు మురుగు"..
ఈయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు జాతీయస్థాయి వివేకానందా వ్యాస రచన పోటీలలో వరుసగా ఆరుసంవత్సరాలు ప్రథమ బహుమతి అందుకున్నారట..బాపు రమణలతో కలిసి చిత్రపరిశ్రమలో 20 ఏళ్ళు పనిచేసారట...ప్రస్తుత కథ 1993 సంవత్సరంలో ఆంధ్ర జ్యోతి వార పత్రిక కోసం వ్రాసినది..ఈ కథకు "జ్యేష్ట లిటరరీ" అవార్డు లభించింది....
ఓ ఇంట్లో ఓ బామ్మకీ, మనవడికీ ఉన్న బంధం గురించి చెప్తుందీకథ. మడి, పూజ వంటివి లేకపోయినా, "మొక్కకు చెంబుడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం...ఇవే బామ్మకు తెలిసిన బ్రహ్మసూత్రాలు...గుడినీ, గుడిలో లింగాన్నీ మింగేసే ఓ స్వాములారి సేవలో కొడుకుకు ఉన్న మడులూ, మాన్యాలూ అంతరించిపోగా, మనవడికి అంతా తానై పెంచుతుంది...పెరట్లో ఉన్న బాదం చెట్టు ఇద్దరికీ ఆవాసం..రాలిపడిన బాదం కాయలూ, అమ్మకి తెలియకుండా, చెట్టుతొర్రలో మిఠాయిలూ, జీళ్ళూ దాచే బామ్మే మనవడికి తోడూ, నీడా, దైవం అన్నీనూ...పరువు తక్కువగా... బయటి చిరుతిళ్ళు మనవడికోసం కొని పెడుతోందని తెలిసిన కొడుకూ కోడలూ బామ్మ చేతికి డబ్బులు అందకుండా చూస్తే,....... బియ్యం ఎదురిచ్చి జీళ్ళు కొంది బామ్మ....ఆ తరువాత బియ్యం డబ్బాకి కూడా తాళం పడితే, మనవడి పీచుమిఠాయి కోసం దేవుడిగదిలో కంచు గంటకి కాళ్ళొస్తాయి...మిఠాయిలూ, జీళ్ళూ, పీచుమిఠాయి ఆరోజుకి ఇచ్చేసి, మరుసటి వారం సంతరోజు వాడొచ్చి ఇంకా బాకీ ఉన్నానని మరిన్ని జీళ్ళూ, వగైరా ఇచాకగానీ ఇంట్లో కంచుగంట ఆచూకీ తెలియలేదు...పూజలూ, పునస్కారాలూ, స్వాములోర్లూ, సత్కారాలూ, జప తప హోమాదుల్లో మడులూ మాణ్యాలూ కరిగిపోవడం ఎలా తెలియలేదో, అంత దాకా ఒకటే కంచం, ఒకటే మంచంగా బామ్మతో బ్రతికిన మనవడికి కంచం , మంచం వేరయ్యాక గానీ, తనకి వయసొచ్చిందని తెలియలేదు...పెళ్ళీడు వచ్చాక, వరస అయిన మనవరాలు (కూతురి కూతురు) ఉన్నా కూడా ఆమే గుణం తెలిసి బయట సంబంధం చూస్తుంది బామ్మ..నాలుగు కాసుల బంగారం దగ్గర సంబంధం చేజారుతుందంటే, ఏదో మాయ చేసి, సంబంధం ఖాయం చేస్తుంది..పెళ్ళి సమయం లోనూ, మరణ శయ్య మీద ఉన్నప్పుడూ ...అసలు మనవడికి గ్రాహ్యకం వచ్చినదగ్గర్నుండీ ఎన్నో జీవిత సయ్తాలు చెప్తుంది బామ్మ....విచారించకు వెర్రి నాగన్నా....ఇప్పుడు వెళ్ళి, అటూ ఇటూ కాస్త పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అని మనవడికి భరోసా ఇచ్చి కన్ను మూస్తుంది...
స్థూలంగా ఇదీ కథ...అయితే, కథ ఆద్యంతం, తెలుగు భాష తీయదనం ప్రవహిస్తూ ఉంటుంది...బామ్మల దగ్గర బాల్యాన్ని గడిపిన అదృష్టవంతులందరూ ఈ కథలో తమ బాల్యాన్ని పోల్చుకుంటారు.
"పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ, వేధింపులూ బామ్మ దగ్గరలేవు"...
ఎవరైనా ఈ ముసలమ్మకి భయం భక్తీ రెండూ లేవు అంటే " దయ కంటే పుణ్యం లేదు..నిర్దయ కంటే పాపం లేదు...చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం,....నాకు తెలిసిందివే" ...
"మండువా లోగిలి పమిట కప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువలా ఉండేది"...
"పిచ్చి సన్నాసీ! దేవుళ్ళు నిద్దరోతార్రా! దేవుడు నిద్దరోతే ఇంకేవైనా ఉందీ!! మేలుకొలుపులూ మనకోసమే, చక్కెర పొంగలీ మనకోసమే!!"
"బాదం చెట్టు భోషాణం"..
"విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయిలు"...
"నాది అనుకుంటే దు:ఖం, కాదు అనుకుంటే సుఖం"...
"దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది---దిక్కులేని వాళ్ళకి"...
"ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్నావరించింది"..
"ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా?"..
" పిల్ల పొందిగ్గా ఉంది...పచ్చగా దొరసానిలా ఉంది...కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి...నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు..."
"అరటి దూట కూరకీ, ముగ్గులకీ బోలెడు ఓర్పూ, నైపుణ్యం కావాలి...అలాంటి అమ్మాయి సంసారాన్ని చక్కదిద్దుగోగలదు.."
"ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి.. నువ్వు ఆకు వక్క వేసుకుంటే ఆ అమ్మడి నోరు పండాలి...అదీ ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి"...
ఇలాంటి మనసు నిండే వాక్యాలు ఇంకా ఎన్నో ఈ కథలో, అన్నీ చెప్పాలంటే మొత్తం కథ చెప్పాలి...ఈకథని ఈపాటికి మీరందరూ చదివే ఉంటారు. చదవకపోతే తప్పనిసరిగా ఒక్కసారైనా చదవండి....ఒక్క సారి చదివాక, ఆరోజే మరో నాలుగైదు సార్లు చదవకుండా ఉండలేరు...ఇంత మంచి కథను చదవడం మిస్ అయ్యరంటే మాత్రం జీవితంలో కొన్ని అనుభూతులను మిస్ అవుతున్నట్లే...
మీ స్పందనని తెలియపర్చడం మర్చిపోవద్దు...

No comments:

Post a Comment